ఎట్టకేలకు పౌరసత్వ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక రాజ్యసభ వంతు మిగిలివుంది. అదికూడా అయిపోతే రాష్ట్రపతి సంతకంతో రాజముద్ర పడనుంది. నిజానికి ఎప్పుడో ఈ బిల్లును తీసుకుని రావాల్సి ఉంది. వివిధ దేశాల్లో ఉంటూ అక్కడి వేధింపులు తట్టుకోలేక వలసవచ్చిన మైనార్టీ హిందువులు, సిక్కులు, జైనులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లు చారిత్రాత్మకమైనదిగా చెప్పుకోవాలి. ట్రిపుల్ తల్లాక్, 370 రద్దు వంటి బిల్లుల తరవాత ఇది కూడా అంతే ప్రయోజనకమైన చట్టంగా చూడాలి. ఇదో చారిత్రక అవసరం. దేశ విభజన సమయంలోనూ, అంతకు ముందు ఆయా దేశాల్లో పౌరులుగా ఉన్న వారిని మతం పేరుతో హింసలకు గురి చేశారు. లక్షల మందిని చంపేశారు. మతం మార్చేలా చేశారు. ఇవన్నీ తట్టుకుని ఇక అక్కడ ఉండలేమని భావించి వచ్చిన వారిని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేయడమే ఈ పౌరసత్వ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. దీనిని వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు తమ కుహనా రాజకీయాలను బయట పెట్టుకున్నాయి. అర్థరాత్రి వరకు ఏడు గంటల సుదీర్ఘచర్చ అనంతరం లోక్సభ సౌరసత్వం చట్టబిల్లుకు ఆమోదం తెలపడం నిజంగానే అభినందనీయం. భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులను ఆదుకునేందుకే ఈ బిల్లు ఉద్దేశ్యమని బిజెపి ముందునుంచీ చెబుతోంది. వారినే ఎందుకు పౌరులుగా గుర్తించాలనుకుంటున్నదీ చెప్పింది. ఈ బిల్లుతో దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండదని కూడా ¬ంమంత్రి అమిత్షా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మైనార్టీలకు విఘాతమన్న కాంగ్రెస్ వాదనలో అర్థం లేదు. బిల్లును టీఆర్ఎస్ సహా పలు పార్టీలు వ్యతిరేకించిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచాలి. వాటికి విశాల ప్రయోజనాల కన్నా ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్యమని గమనించాలి. అయితే ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర ¬ంమంత్రి అమిత్షా ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్లో మత పరమైన దాడులకు గురై భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులను ఆదుకునేందుకే ఈ బిల్లును రూపొందించామని స్పష్టంచేశాక కూడా వ్యతిరేకించడం ద్వారా కుహనా రాజకీయాలకు ఆయా పార్టీలు తెరలేపాయి. మన దేశంలోని ముస్లింలకు ఈ బిల్లుతో ఎలాంటి సంబంధం లేదు. ఈశాన్య రాష్టాల్ర ప్రజలు ఆందోళన చెందవద్దని, ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) కింద ఆయా రాష్టాల్రకు ఈ బిల్లు నుంచి మినహా యింపు ఇస్తున్నట్టు అమిత్షా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్ర సమయంలో దేశాన్ని మతం ప్రాతిపదికన విభజించింది. అయినా అక్కడే పుట్టి పెరిగివున్న హిందూ,సిక్కు మైనార్టీలకు పాక్లో రక్షణ లేకుండా పోయింది. నిజానికి దేశవిభజన జరగకపోయి ఉంటే ఉంటే ఈ బిల్లు తేవాల్సిన అవసరం ఉండేది కాదన్న ¬ంమంత్రి అమిత్షా ప్రకటనను ఇక్కడ అంతా గ్రహించాలి. పాక్,బంగ్లాల్లో ఎందరో అమాయక హిందువులు అక్కడి ముస్లింల దాడులకు బలయ్యారు. బతుకు జీవుడా అంటూ వేలాదిమంది మనదేశానికి పారిపోయి వచ్చారు. వారిని కాపాడుకోవడం మినహా మరో గత్యంతరం లేదు. అందుకే ఈ బిల్లు తేవాల్సి అవసరం ఏర్పడింది. ఇది దేశంలోని మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నదని కాంగ్రెస్,దేశంలో ముస్లింలకు నీడ లేకుండా చేస్తారా? అని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల్లో అర్థం లేదు. ఈ బిల్లుతో అమిత్ షా హిట్లర్ సరసన నిలుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బిల్లు ప్రతులను చించివేయడం ద్వారా ఓవైసీ తన కుత్సిత రాజకీయాలను ప్రకటించుకున్నారు. ఇక్కడా రాజకీయాలు చొప్పించడం వారికే చెల్లింది. బిల్లుపై ఏడు గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 311 మంది, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు.దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం
బిర్లా ప్రకటించారు. కేవలం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్లో దాడులకు గురై భారత్కు వలసవచ్చిన మైనార్టీ హిందువులకు స్వాంతన కలిగించి, వారి హక్కులను రక్షించేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టామని అమిత్షా పదేపదే పేర్కొన్నా విపక్షాలు మాత్రం నిజాలను గుర్తించలేక పోయారు. నేపాల్ పౌరులెవరైనా భారత పౌరసత్వాన్ని సులభంగా పొందవచ్చు. ఇక మయన్మార్ లౌకిక దేశం. కానీ.. పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ ముస్లిం దేశాలు. అక్కడ మైనార్టీలపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని బిల్లులో చర్చ సందర్భంగా అమిత్ షా పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో పాక్లో 23 శాతంగా ఉన్న హిందూ మైనార్టీలు ఇప్పుడు 3 శాతానికి పరిమితమయ్యారు. అక్కడ హిందువులను ఊచకోత కోశారు. అంతెందుకు విభజన సమయంలో గుట్టలుగా రైలు బోగీల్లో శవాలు పంపిన చారిత్రక సత్యాన్ని విస్మరించగలమా అన్నది ఆలోచించాలి. అక్కడ ఉంటే ముస్లింలుగా ఉండాలి. లేకుంటే చావాలి. లేదా మతం మారాలన్న ఛాందసవాద ఆదేశాలతో అనేకులు మతం మారారు. బలవంతంగా మతం మార్చారు. బంగ్లాదేశ్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. వీరందరికీ రక్షణ అవసరమని అమిత్ షా తెలిపారు. ఈ బిల్లు విభజనకారి కాదని, ఆర్టికల్ 14కు వ్యతిరేకం కాదని కూడా స్పష్టం చేశారు. ఇలా గతంలో అనేకమార్లు శరణార్థులకు పౌరసత్వం కల్పించామని గుర్తుచేశారు. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి నప్పుడు, ఉగాండాలో భారతీయులపై దాడులు జరిగినప్పుడు ప్రత్యేక నిబంధనల ద్వారా బాధితులకు పౌరసత్వం ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. ఈ మూడు దేశాల్లో ముస్లింలు మతపరమైన దాడులకు గురయ్యే ప్రమాదం లేదు. అందువల్ల రోహింగ్యాలను గుర్తించలేమని కూడా షా తెలిపారు. మొత్తంగా ఈ బిల్లు వల్ల భారత్తో విడిపోయి ముస్లిం దేశాలుగా ఉన్న పాక్,బంగ్లాల నుంచి వచ్చే హిందువులకు రక్షణగా నిలవనుంది. బిజెపి చేపట్టిన సాహసోపేత నిర్నయాల్లో ఇది కూడా ఒకటని గుర్తించాలి. ఇదో చారిత్రక అవసరమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే చట్టంగా చూడాలి.