నగరంలో మెరుగైన పారిశుద్యం




హైదరాబాద్‌ స్వఛ్చతకు ప్రత్యేక శ్రద్ద

స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన కెటిఒఆర్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌13 (జనం సాక్షి) : హైదరాబాద్‌ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ద్యాన్ని అందిస్తున్నా మని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్‌ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభించాం. నగరాన్ని పరిశుభ్రంగా
ఉంచేందుకు నాడు కేసీఆరే స్వయంగా 2500 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించి.. స్వచ్ఛ హైదరాబాద్‌ స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఐదారు సంవత్సరాల నుంచి కేంద్రం ప్రకటించే స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగ్స్‌లో బెస్ట్‌ నగరంగా హైదరాబాద్‌ నిలుస్తూ వస్తుందన్నారు. ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న మున్సిపల్‌ సిబ్బందికి కేటీఆర్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సఫాయి అన్న.. నీకు సలాం అన్న.. అని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆ మాటతోనే సరిపెట్టకుండా, సఫాయి కార్మికులు అడగకముందే మూడు సార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. నగరంలో 2500 ఆటో టిప్పర్లు ప్రవేశపెట్టకముందు 3500 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేది. ఈ ఆటో టిప్పర్లు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం వల్ల.. 6500 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. మొత్తంగా చెత్తను డంప్‌ యార్డులకు తరలిస్తున్నారు. స్వచ్ఛతలో హైదరాబాద్‌ నగరం ముందుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న హాస్పిటాలిటీ ఎక్కడా లేదన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ కొత్తగా సమకూర్చిన 250 స్వచ్ఛ ఆటోలను సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో తలసానితో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. స్వచ్ఛతలో హైదరాబాద్‌కు ఎన్నో అవార్డులు వచ్చాయని చెప్పారు. నగరంలో పార్కులు, రోడ్లు, బస్‌ షల్టర్లు సుందరంగా మారాయన్నారు. గరవాసులు స్వచ్ఛ ఆటోలను ఉపయోగించుకోవాలని సూచించారు. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.